
చిత్రం: సిరి సిరి మువ్వ
రచన:వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పీ.సుశీల
సంగీత దర్శకత్వం:కే.వీ.మహదేవన్
దర్శకత్వం:కాశినాధుని విశ్వనాథ్
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం
ఝుమ్మంది
మెరుపుంది నాలో – అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో – అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది !!
మొట్ట మొదటసారి ఈ పాట వింటున్నప్పుడు నా మనసు పరవశించిపోయింది.ఈ పాట వెనుక ఉన్న లలితమైన రాగం,అందమైన పదాల పొందిక కారణాలు కావచ్చు.ఎంత మాయ చేస్తోందీ పాట అనుకున్న సందర్భాలు వున్నాయి.కానీ ఒక సందర్భంలో మరోసారి ఈ పాట వింటున్నప్పుడు నాదం ఝుమ్మనడమేమీటీ?పాదం సై అనడమేమీటి?తనువూగడమేమిటీ?రాస లీల చెలరేగడమేమీటీ? కవిగారు తనదైన శైలితో,పదాలతో ఆడుకోవడమేమిటీ? కాశీనాధుని విశ్వనాధ్ అంతటి వారు ఏ మాత్రం సందేహించకుండా తన సినిమాలో వాడుకోవడమేమిటీ? అసలేం జరుగుతోందిక్కడ? అని అనుకున్న రోజులూ కూడా వున్నయి.ఐతే ఈ పాటకు భావం స్ఫురించినప్పుడు,ఈ పాటలోని స్వర మధురిమతో పాటు సాహితీ మకరందపు విశేషం అవగతమయిన హృదయం ఎంతగానో మురిసిపోయింది.
అయితే ఇక్కడ ఈ పాట సినిమాలో ఏ సందర్భంలో వాడారో కూడా తెలుసుకోవాలి,లేకపోతే ఈ పాట యొక్క రమ్యత ప్రేక్షకుల హృదయానికి చేరదనిపించింది.ఇందులో కథా నాయికకు తండ్రి ఉంటాడు కానీ పెత్తనమంతా సవతి తల్లిది.అందుకే కథా నాయికకు ఎంతో ఇష్టమైన నాట్యమును చేయనివ్వదు.ఒకసారి సవతి తల్లి ఎదో పని మీద పొరుగూరికి వెళ్ళినప్పుడు కథా నాయికకు నాట్యం చేసే అవకాశం వస్తుంది. ఆ ఆనందంలో కథా నాయిక పాడుకునే పాట.మధ్యలో నాయకుడు కూడా కలుస్తాడు.కాని అది వేరే సంగతి.
ఈ పాట గురించి నాకు అర్ధమైన విషయమును మీతో పంచుకునే ముందు ఇంకోకటి చెప్పాలనిపించింది అదేమిటంటే … ఈ పాటను మొట్ట మొదటసారి విన్నప్పటి నుంచి ఈ పాటలో నాయికా నాయకులుగా పార్వతీ పరమేశ్వరులను చూడటం జరిగింది కానీ సినిమాలో పాత్రధరులు నాకు కనపడలేదు.బహుశా కవిగారు కూడా ఆదిదంపతులను దృష్టిలో పెట్టుకునే వ్రాసి ఉంటారన్న భావన నాకు కలిగినప్పుడు మనస్సు ఆనందపుటంచుల్లో విహరించింది.
ఝుమ్మంది నాదం అన్న పదం వినగానే మల్లికార్జున స్వామి అవతారమెత్తిన పరమశివుణ్ణి పార్వతి దేవి భ్రమరాంబికా దేవి రూపంలో సేవించిన వైనం గుర్తుకు వచ్చింది.భ్రమరం అంటే తేనేటీగ,మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు.తెల్లటి మల్లెపువ్వు చూస్తే ఒక తేనే తీగకు ఆకర్షణ కలుగకుండా వుంటుందా?అలాగే మల్లికార్జున స్వామి రూపంలో ఉన్న శివుణ్ణి చూసిన ఆనందంలో భ్రమరాంబికాదేవి రూపంలో వున్న పార్వతీ దేవి ఝుమ్మని అందిట.అదే నాదమైంది.నాట్యాధిదేవతలు కదా గౌరీశంకరులు.స్వామిని చూస్తున్న సంతోషంలో నాట్యం చేయడం మొదలుపేట్టింది అమ్మ.అయ్య శంకరుని కదిలించే ప్రయత్నంలో అమ్మ ఆనంద తాండవం చేస్తోంది. తల్లి ఆనంద తాండవం చేస్తున్న సమయంలోనే జగ్గత్తుకంతటికీ అభయాన్ని ప్రసాదించే అమ్మ పాదం సై అని అంది.ఏ సమయంలోనయితే అమ్మ భవాని తన పతి అయిన విశ్వనాథున్ని తన నాట్యంతో రాసలీలకు వేళ అయిందని పిలించిందో/పిలుస్తుందో ఆ సమయం రసరమ్యభరితమై లోకాలన్నింటికీ శుభదాయకమైంది/శుభదాయకమవుతుంది.
అమ్మవారు అయ్యవారి కోసం ఇంకా నాట్యం చేస్తూనే వుంది.గౌరీ దేవి,శంకరుని కోసం పడే తాపత్రయం ఇక్కడ వర్ణించారు.నది ఆనందంతో ఎలా ఉప్పొంగి పోతూ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోతుందో(ఎలరేటి రొదలా)అలా శాంభవి దేవి ఎదురుగా మల్లికార్జునుని రూపంలో వున్న శంభుని చూసి ఆనందంతో నాట్యం చేస్తోంది.సముద్రం బడబాగ్నిని తన గర్భంలోనే దాచుకున్నట్లు,స్వామి సాక్షాత్కారం కలగటం లేదన్న బాధ ఎక్కువవుతున్నా,దాన్ని తన మనస్సులోనే దాచుకుని పైకి తెలియనివ్వకుండా (ఎదలోని సొదలా) అమ్మ నర్తిస్తున్నది.చాలా సేపటి నుండీ నర్తిస్తున్నా శివ సాక్షాత్కారం కలగకపోవడంతో,కదిలే నది తాను నిర్మలంగా వుంటునే మరింత రమణీయంగా ఎలా ముందుకు సాగిపోతుందో,ఆశలు తరగని హృదయం ఎడతెరగకుండా కలలను ఒక వరదలా ఎలా కంటుందో,అలా తన నాట్యంలో ఆనందపుటావేశం తగ్గినా కూడా ఆపకుండా అంతే పట్టుదలతో , ప్రేమతో ,శివానుగ్రహంకై మరింత రమ్యంగా,రమణీయంగా నర్తిస్తున్నది గిరిరాజపుత్రి.సదాశివుణ్ణి పార్వతీదేవి తన నృత్యంతో ఆరాధిస్తున్న వేళ,అమ్మవారి కదిలే(చలిత) అందమైన(లలిత) పాదపద్మములు(పద),శంభుని పట్ల ప్రేమను కలిగినదై(కలిత),శంకరుణ్ణి స్తుతించే సరికొత్త స్తోత్రమై(కవితై),పశుపతి మనస్సు కరిగేట్టుగా,సామవేద సారమగు సంగీతానికి మూలాధారమైన సరిగమలను పలికించి,సప్త స్వరాలలోని మధురిమలను ఒలికించగా,అమ్మవారి పాదారవిందములకు అంటిపెట్టుకుని వున్న సిరి సిరిమువ్వలతో పాటూ విశ్వమంతా పులికించినది.
“నటరాజ ప్రేయసీ,నీవు నర్తించే ఊర్వశివి అని అనుకున్నాను ఇన్నాళ్ళు.ఇక్కడ నా ముంగిట నర్తిస్తున్నది ఇంద్రుని లోకంలోనున్న అప్సర ఊర్వశి కాదు అని,పర్వతములన్నింటికీ రాజైన హిమవంతుని కూతురు ఉమాదేవివని ఇప్పుడు తెలిసింది. నీవు యోగమాయవు కదా,నా శక్తిస్వరూపమైన నిన్ను గుర్తించడానికి ఇన్నాళ్ళు పట్టింది.ఎప్పూడైతే నా కోసం తపిస్తున్నది నాలో ఉన్న నీవేనని గ్రహించానో,ఆనాడే నాలో నున్న ఆవేశం ఆకాశమై పొంగిపోయినది.శివస్వరూపమైన కైలాసమే వంగి నీ రాకకై ఎదురు చూస్తున్నది” అంటూ పొంగిపోయెను ఆమ్మవారి ప్రేమకు,తపస్సుకు మెచ్చిన విశ్వాత్మకుడైన పశుపతి .
శివపార్వతులు ఒకరి కొసం ఒకరు చేస్తున్న తపస్సు ఈనాడు ఫలించింది.ఆది దంపతులు మళ్ళీ ఒకటయ్యారు.ప్రపంచమంతా పులకరించిపోయి హర్షం వ్యక్తం చేసింది.ఆనందం పరవశులై వారు నాట్యం చేస్తున్న వేళ “శివ సన్నిధిని పొందడం వల్ల నాలో కలిగిన సంతోషం మెరుపై నిలిచినది(మెరుపుంది నాలో)” అన్న గౌరమ్మ మాటలకు,”చిరునవ్వుతో నీవు నా చెంత చేరినప్పుడు నీ మేనిలో కలిగే విరుపే అది(అది నీ మేని విరుపు) ” అని శివయ్య బదులు ఇచ్చేను.దానికి ” మరి నాకు కోపం కొంచెం ఎక్కువే,అప్పుడప్పుడు కోపం ఎక్కువైనప్పుడు గర్జిస్తూ వుంటాను కదా (ఉరుముంది నాలో)” అన్న ఉమా దేవి పలుకులకు శంకరుడు “దేవీ! నువ్వు అమ్మల గన్న అమ్మవు,ముజ్జగాలకే మూలపుటమ్మవు.నీ కన్నులు లోకాలన్నింటిపైనా కరుణామృత వర్షమును కురిపిస్తాయే కానీ అగ్నిని వర్షించవు అని నాకు తెలుసు. నువ్వు శ్రీమన్నారాయణుని చెల్లెలివి.అందుకే ఆయనలానే నువ్వూ దుష్ట సంహారానికై అవతారాలు ఎత్తుతావు.దుర్గ అని,కాళి అని,చండి అని ,చాముండీ అని ఒకట రెండా, ఇలా ఎన్నెన్నో అవతారలు ఎత్తి దైత్య సంహరాలేన్నింటినో నువ్వు కావించినా ,ఆ సమయంలో నువ్వు చేసే వీరహుంకారము నీ అందెల రవళులై నన్నే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు (అది నీ మువ్వ పిలుపు). ఒకే సమయంలో రాక్షసులపై వీర రసమును,నాపై శ్రంగార రసమును కురిపిస్తావు.ఇలా చేయడం నీ ఒక్కదానికే చెల్లును కదా!రాక్షస సంహారం గావించి శాంతించిన తరువాత నువ్వు మూర్తీభవించిన శివానందలహరివి .ఎల్ల లోకాలకు శుభమును జేకూర్చే సౌందర్యలహరివి.మహదానందంతో నువ్వు నాట్యం చేస్తున్న వేళ,నీ కరుణే అమృతవర్షమై,ప్రతి చినుకులోనూ లయ తప్పకుండా నర్తిస్తూ,లోకాలపై ప్రసరించే తొలకరి జల్లైనది.అంతేనా నువ్వు నాతో నడిచిన ఏడడుగులు,నాతో నువ్వు కలిసున్నప్పుడు నీలో కలిగిన సంతోష తరంగాలే ఏడు రంగులుగా, లోకాలన్నింటికి ముదమును జేకూర్చే అందాల హరివిల్లు అయినది కదా..”అన్న శివయ్య మాటలకు,అమ్మతో పాటూ లోకాలన్నీ కూడా ఎంతగానో మురిశాయి.ఎంతైనా శివా అంటేనే మంగళమును ప్రసాదించువాడు అని,ఙ్ఙానమే శివస్వరూపంలో ఉంటుంది అని మనము తెలుసుకున్నాము. ఎంతైనా అమ్మ,అయ్య ఇద్దరూ ఒకటే కదా! శివుని శరీరంలో అర్ధ భాగాన్ని స్వీకరించి అభవార్ధభాగిని అనిపించుకున్నది మా అమ్మ పార్వతీ దేవి.అలాగే అమ్మకు తనలో సగ భాగమిచ్చి అర్ధనారీశ్వరుడవనిపించుకున్న వాడు మా తండ్రి పరమేశ్వరుడు.ఇలా ఇద్దరూ ఒకరికొకరు సరిగ్గా బాగా ఎలా సరిపోయారో మన అందరికి తెలుపడానికే కదా కవిగారు ఇంత ప్రయత్నము చేసినది.అందుకే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము.

;









